ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలి

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటించాలి

జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి నవంబర్ 27 (ప్రజా కలం) ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జిల్లాలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో గ్రామాలు అలాగే కోరుట్ల మండలంలోని మోహన్‌రావుపేట గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని,ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలన్నారు.గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రిజర్వేషన్ల వివరాలు నోటీస్ బోర్డుపై సక్రమంగా ప్రదర్శించబడ్డాయా లేదా అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రస్తుతం వరకు ఎన్ని నామినేషన్లు స్వీకరించబడ్డాయి, అలాగే నామినేషన్ల ఫార్మ్స్ ఎంతమంది అభ్యర్థులు తీసుకున్నారనే వివరాలను సంబంధిత అధికారుల నుంచి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు. నామినేషన్ స్వీకరణ, రికార్డు నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, అభ్యర్థులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆయన పలు సూచనలు అందించారు. నామినేషన్ ప్రక్రియ చట్టబద్ధంగా, ఎవరికీ ఇబ్బందులు లేకుండా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు మరియు తదితర అంశాలను పరిశీలిస్తూ, సపోర్టింగ్ స్టాఫ్ సరిపడా ఉన్నారా అని ఆరా తీశారు. నోటీసు బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలు దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు.నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు తొలి విడత ఎన్నికల ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చని తెలిపారు. నవంబర్ 30 రోజున వీటి పరిశీలన ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంటుందని తెలిపారు. మొదటి విడతలో 7 మండలాల్లోని 122 గ్రామాలు, 1172వార్డుల్లో డిసెంబర్ 11 న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుందని అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఈ పరిశీలనలో ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )