
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు
– జిల్లా ఉపవైద్యాధికారి ముస్కు జైపాల్ రెడ్డి
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి, జనవరి 9 (ప్రజాకలం) : స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఉపవైద్యాధికారి ముస్కు జైపాల్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మెట్ పల్లి పట్టణంలోని పలు స్కానింగ్ సెంటర్లను జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎం.జైపాల్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాస్ లు కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం 1994 ప్రకారం లింగ నిర్ధారణ చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. స్కానింగ్ సెంటర్లలో స్కానింగ్ మిషన్స్, డాక్టర్ల అర్హత ధ్రువీకరణ పత్రాలు దరఖాస్తు చేసుకున్న విధంగానే ఉన్నాయా అని నిర్ధారించుకున్నారు. ఫారం ఎఫ్ లు ప్రతినెల 5వ తారీఖు లోపు వారికి కేటాయించబడిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రo, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలలో సమర్పించాలని ఆదేశించారు. ఫారం ఎఫ్ లు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఒకే విధంగా ఉండాలన్నారు.

పేషంట్లకు కనపడే విధంగా ఇక్కడ లింగ నిర్ధారణ చేయబడదు – లింగ నిర్ధారణ చేసినచో కఠిన చర్యలు తీసుకోబడతాయి అను ఫ్లెక్సీ బోర్డులు, ఫోం బోర్డులు ఏర్పాటు చేయాలని డాక్టర్ జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ నిబంధనలు అతిక్రమించి లింగ నిర్ధారణ చేస్తే జరిమానా విధించబడడమే కాకుండా అందుకు ప్రోత్సహించిన వారిపై కూడా జరిమానా, మూడు నెలల జైలు శిక్ష కూడా ఉంటుందని, వైద్యుల యొక్క రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారికి నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్స్ కటుకం భూమేశ్వర్, తరాల శంకర్, ఆరోగ్య పర్యవేక్షకులు ఇండీవర శామ్, అచ్యుత రావు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

