
నిబంధనలకు తూట్లు – ప్రజలకు తప్పని పాట్లు
నిబంధనలకు తూట్లు – ప్రజలకు తప్పని పాట్లు
— అనుమతుల పేరిట పరిమితికి మించి మట్టి దందా
— పట్టించుకోని అధికారులు – ఆందోళనలో ప్రజలు
కాల్వశ్రీరాంపూర్ మే 31 (ప్రజాకలం ప్రతినిధి): కాల్వశ్రీరాంపూర్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా అడ్డూఅదుపూ లేకుండా సాగుతున్నాయి.ముఖ్యంగా పందిళ్ళ గ్రామంలోని ఊర చెరువు నుంచి ఇటుక బట్టీల యజమానులు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారు.అనుమతులకు మించి భారీ లోడుతో టిప్పర్లు రోడ్లపై పరుగులు తీస్తుండటంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది.మైనింగ్ శాఖ నుంచి అనుమతులు పొందినప్పటికీ,ఇటుక బట్టీల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.పరిమిత పరిమాణంలో మట్టిని తరలించాల్సి ఉండగా,పెద్ద పెద్ద టిప్పర్లలో ఓవర్లోడ్తో రవాణా చేస్తున్నారు.దీనివల్ల రోడ్లు కుంగిపోవడమే కాకుండా,పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
ఓవర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ల నుంచి మట్టి రేణువులు,ధూళి కణాలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి.ఇవి ప్రయాణికుల కళ్ళల్లో పడి ప్రమాదాలకు గురిచేయడమే కాకుండా,కొందరికి దగ్గు,ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. మట్టి రవాణా సమయంలో దుమ్ము తగ్గించడానికి రోడ్లపై నీటిని చల్లించాలనే నిబంధనను కూడా యజమానులు పాటించడం లేదు.
కుంగి పోతున్న రహదారులు – ప్రమాదాలకు నిలయాలు
కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కమాన్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రహదారి ఓవర్లోడ్తో వెళ్తున్న టిప్పర్ల కారణంగా పూర్తిగా దెబ్బతింది. రోడ్డు కుంగిపోయి ప్రయాణికులకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.పది కాలాల పాటు భద్రంగా ఉండాల్సిన రహదారులు అనతి కాలంలోనే ధ్వంసమవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
అక్రమ మట్టి రవాణాపై మైనింగ్,రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.శుక్రవారం కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలో జరిగే వారసంత రోజున ఈ భారీ టిప్పర్ల రాకపోకలు ప్రజలకు నరకం చూపిస్తున్నాయి.జనసమర్దం మధ్య నుంచి టిప్పర్లు వెళ్తుండటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి,వాహనదారులు, వ్యాపారులు,ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.గతంలో ఇదే మండలంలోని పెగడపల్లి గ్రామంలో వారసంత సమయంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటూ, అధికారులు ఇప్పటికైనా నిద్రలేచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఇటుక బట్టీల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని,ప్రజల ఇబ్బందులను తొలగించాలని మండల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.
అధిక లోడుతో మట్టిని తరలిస్తున్న లారీ