గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు

గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పటిష్ట ఏర్పాట్లు

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్
కోరుట్ల, మెట్ పల్లిలలో గణేష్ నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
మెట్ పల్లి:(కోరుట్ల) ప్రతినిధి సెప్టెంబర్ 02(ప్రజా కలం)
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం గణేష్ నిమజ్జన ప్రాంతాలైన కోరుట్లలోని అంబేద్కర్ కాలనీ దగ్గర పెద్ద వాగు, మెట్ పల్లిలోని వట్టి వాగును పరిశీలించారు. గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో చేస్తున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయి లో పరిశీలించి సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జనానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం గణేష్ నిమజ్జమం సులభంగా జరుగుటకు నిమజ్జన ప్రాంతాల్లో బారికేడింగ్ ను ఏర్పాటు చేయాలని, అవసరమైన క్రేన్లను, విగ్రహాల నిమజ్జనానికి సరిపోను తెప్పలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. నిమజ్జనం సమయంలో రద్దీని నియంత్రించడం, ప్రజల భద్రత వంటి అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు వారు సూచించారు. ఆయా నిమజ్జన ప్రాంతాల్లో శానిటేషన్, తగినంత హై మాస్ట్ లైటింగ్, మంచినీటి సౌకర్యం, ఏర్పాట్లు ఉండేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక పోలీసు శాఖల అధికారుల సమన్వయంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా చూడాలని అన్నారు. విగ్రహాల తరలింపు సమయంలో ఎక్కడ విద్యుత్ షాక్ గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలని, నిమజ్జనం రూట్ లో అవసరమైన రోడ్డు మరమ్మతుల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఎత్తైన విగ్రహాల తరలింపు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. విగ్రహాల తరలింపుకు అడ్డు వచ్చే విద్యుత్ వైర్లను సరిచేయాలని తెలిపారు.
నిమజ్జనం ప్రశాంత వాతావరణం లో జరిగే విధంగా చూడాలని, చెరువులో నీటి మట్టం ఎక్కువగా ఉన్నందున గజ ఈతగాళ్లు అందుబాటు లో ఉండేలా సంసిద్ధం గా ఉండాలని అన్నారు. అధికారులు సమన్వయంతో నిమజ్జన ప్రాంతాలలో ఏర్పాట్లను పూర్తి చేసి విధులను నిర్వర్తించాలన్నారు. నిమజ్జన ప్రదేశాలలో తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల రాకపోకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా అన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో , కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీఓలు శ్రీనివాస్, జీవాకర్ రెడ్డి, డిఎస్పీ రఘు చందర్, రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్, పోలీసు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )