జియోసైన్సెస్ లో భవిష్యత్తు గమనానికి భారత్ బాటలు

జియోసైన్సెస్ లో భవిష్యత్తు గమనానికి భారత్ బాటలు

జియోసైన్సెస్ లో భవిష్యత్తు గమనానికి భారత్ బాటలు

హైదరాబాద్ లోని జీఎస్ఐలో ‘నెక్ట్స్ జనరేషన్ జియోఫిజిక్స్ 2025’ సదస్సును ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్, 9 జూన్, (ప్రజాకలం)

హైదరాబాద్ బండ్లగూడ-నాగోల్ లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (జీఎస్ ఐటీఐటీఐ)లో ‘నెక్ట్స్ జనరేషన్ జియోఫిజిక్స్ 2025: అన్ లాక్ ఎర్త్ హిడెన్ ట్రెజర్స్ ‘ సదస్సును కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు శ్రీ ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఖనిజ అన్వేషణలో శాస్త్ర, సుస్థిరత, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించే కొత్త శకంలోకి భారత్ ప్రవేశిస్తోందని అన్నారు. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, విపత్తుల నివారణ వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి వినూత్న సాధనాలను అందించడం ద్వారా వికసిత భారత్ లక్ష్యాలను సాధించడంలో భూభౌతికశాస్త్రం పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ ఐ) తన 175వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సరైన సమయంలో ఈ సదస్సును నిర్వహించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. సహజ వనరుల శాస్త్రీయ అన్వేషణలో భారత్ దీర్ఘకాలిక నిబద్ధతకు ఈ మైలురాయిని ఆయన ఒక నిదర్శనంగా అభివర్ణించారు.

కొండచరియలు విరిగిపడడాన్ని ముందుగా సూచించే జాతీయ కేంద్రం ఏర్పాటు, విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడానికి ఇటలీతో ఇటీవలి అవగాహన ఒప్పందం (ఎంఓయు) సహా భారత్ సాధించిన ప్రధాన పురోగతుల్ని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. పర్యవేక్షణ వ్యవస్థలను విస్తరించాలని, ముందస్తు హెచ్చరికలకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రపంచ విద్య, పరిశోధనల్లో పెరుగుతున్న భారత్ ప్రాబల్యాన్ని మంత్రి ప్రస్తావించారు, క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025 లో భారతీయ సంస్థల పెరుగుదల 318% ఉన్నట్టు పేర్కొన్నారు. ఐఐటీ సీట్లను రెట్టింపు చేయడం, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) ను ఏర్పాటు చేయడం సైన్స్ అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు.

నిక్షిప్త ఖనిజ వనరులను అంచనా వేయడం, భూకంప సమాచారాన్ని మరింత కచ్చితత్వంతో వివరించడం సహా మెరుగైన అన్వేషణ కోసం కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని శ్రీ కిషన్ రెడ్డి జియో సైంటిస్టులను కోరారు. రూ.10,300 కోట్లతో చేపట్టిన ఇండియా ఏఐ మిషన్, రూ.6,000 కోట్లతో చేపట్టిన నేషనల్ క్వాంటమ్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల గురించి ఆయన ప్రముఖంగా పేర్కొన్నారు.

కీలక ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరిస్తూ, కృత్రిమ మేధ ఆధారిత, శుభ్రమైన, సమర్థవంతమైన అన్వేషణ పద్ధతుల ద్వారా లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడాన్ని బట్టి భారత ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వం, విద్యాసంస్థలు , పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాల కోసం సహకారం, సుస్థిరతతో పాటు నూతన ఆవిష్కరణల ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం మినరల్ ఎక్స్ ప్లోరేషన్ హ్యాకథాన్ ను ఒక విజయవంతమైన నమూనాగా ఉదహరించారు. అలాగే స్థానిక సముదాయాలకు లాభదాయకంగా ఉండేలా, పర్యావరణాన్ని పరిరక్షించేలా బాధ్యతాయుతమైన గనుల తవ్వకం విధానాల ప్రాముఖ్యతను కూడా ఆయన స్పష్టం చేశారు.

పార్లమెంటు సభ్యుడు శ్రీ ఈటల రాజేందర్ ప్రసంగిస్తూ, “జియోసైన్స్ ఒక మార్పు దశలోకి ప్రవేశిస్తోంది. ఇక్కడ సంప్రదాయ పద్ధతులు కృత్రిమ మేధ ఆధారిత అంచనా నమూనాలు, క్వాంటమ్ సెన్సింగ్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కలిసి వనరుల అన్వేషణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వికసిత భారత్ నిర్మాణానికి దోహదం చేస్తాయి” అని అన్నారు. ఖనిజ భద్రత, పర్యావరణ సుస్థిరత, ప్రకృతి వైపరీత్యాల సన్నద్ధతకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో జియోసైంటిఫిక్ పరిశోధన కీలక పాత్రను ఆయన వివరించారు. భూ ప్రమాదాల అంచనాలు, ఖనిజ అన్వేషణలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ ఐ) కృత్రిమ మేధను, మెషీన్ లెర్నింగ్ ను వినియోగించడాన్ని ప్రశంసించిన శ్రీ రాజేందర్, డేటా ఆధారిత అన్వేషణ, సుస్థిర వనరుల నిర్వహణలో భారత్ ప్రపంచ అగ్రగామి కాగలదనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

శ్రీ కిషన్ రెడ్డి అంతకుముందు శ్రీ ఈటల రాజేందర్ తో కలిసి, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్ఐ) లో కొత్తగా ప్రవేశపెట్టిన రెండు హైడ్రోస్టాటిక్ డ్రిల్ రిగ్ లను ప్రారంభించారు, ఇది భారత్ భౌగోళిక శాస్త్ర సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అత్యాధునిక జియోఫిజికల్ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అన్వేషణ నమూనాలతో ఏర్పాటు చేసిన నెక్ట్స్ జనరేషన్ జియోఫిజిక్స్ ఎక్స్ పో పెవిలియన్ ను కూడా శ్రీ కిషన్ రెడ్డి ప్రారంభించారు. కీలకమైన ఖనిజ వనరుల సుస్థిర అభివృద్ధి కోసం భారతదేశ దార్శనికతకు మద్దతు ఇచ్చే అగ్రగామి సాంకేతిక పరిజ్ఞాన నమూనాలపై లైవ్ ప్రదర్శనలను కూడా ఈ పెవిలియన్లో ఏర్పాటు చేశారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, అమెరికా, పోలాండ్, మలేషియా, సింగపూర్ దేశాలకు చెందిన ప్రముఖ జియో సైంటిస్టులు, పరిశోధకులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు.. అధునాతన జియోఫిజికల్ టెక్నాలజీలు, ఏఐ/ఎంఎల్ ఇంటిగ్రేటెడ్ ఎక్స్ ప్లోరేషన్ మోడల్స్, హై రిజల్యూషన్ సబ్ సర్ఫేస్ ఇమేజింగ్, డేటా ఆధారిత ఖనిజ అన్వేషణ లక్ష్యాల నిర్దేశంపై సదస్సులో ప్రధానంగా చర్చిస్తున్నారు.

జీఎస్ఐటీఐ మిషన్-5 (ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, హెడ్ డాక్టర్ ఎస్.రవి, జిఎస్ఐ డైరెక్టర్ జనరల్ శ్రీ అసిత్ సాహా, జిఎస్ఐ (దక్షిణ ప్రాంతం) అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీ ఎస్.డి.పట్భాజే, సీనియర్ అధికారులు, అంతర్జాతీయ ప్రతినిధులు, ప్రముఖ భౌగోళిక శాస్త్ర నిపుణులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )