
గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం
గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం
మెట్ పల్లి సీఐ సురేష్ బాబు
మెట్పల్లి:(కోరుట్ల) ప్రతినిధి జూన్ 25 (ప్రజాకలం) పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపించి, వారు ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారో ఎప్పటికప్పుడు గమనించాలని మెట్పల్లి సిఐ సురేష్ బాబు సూచించారు.గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల కొంతమంది యువత వివిధ రకాల మత్తు పదార్థాలకు బానిసలై తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం యువతను ఉన్నత లక్ష్యాల సాధనకు దూరం చేస్తోందని అన్నారు. పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, వారి రోజువారీ అలవాట్లు ఎలా ఉన్నాయనే విషయాలను తల్లిదండ్రులు గమనిస్తూ, అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని సూచించారు. గంజాయి వ్యసనం కారణంగా రేపటి యువత నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని సీఐ సురేష్ బాబు పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి యువతను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా గంజాయి రవాణా, విక్రయాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గంజాయిని పూర్తిగా నిర్మూలించినప్పుడే యువతకు సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని అన్నారు. గంజాయి నియంత్రణ కోసం పోలీసు శాఖ ప్రత్యేకంగా ఈగిల్ టీమ్ను ఏర్పాటు చేసి నిఘా చర్యలను ముమ్మరం చేసిందని సిఐ సురేష్ బాబు తెలిపారు. మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

