
నాణ్యత లేని సిసి రోడ్ల నిర్మాణం
నాణ్యత లేని సిసి రోడ్ల నిర్మాణం
*వేసిన కొద్ది రోజులకే తేలిన కంకర*
*ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు*
*రుద్రంగి, జూన్ 18(ప్రజాకలం ప్రతినిధి)*
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల అభివృద్ది కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం నాసిరకంగా వేశారు. కొద్ది రోజులుగా కురుస్తున్న మామూలు వర్షాలకే సిమెంటు రోడ్లలో కంకర తేలడం, మధ్యమద్యలో గుంతలు పడడం చూసి, ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. లక్షల ప్రజాధనం రోడ్డుపాలు చేశారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పుడిప్పుడు వేసిన రోడ్లే ఇలా ఉంటే, భవిష్యత్తులో ఈ రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో, అసలు రోడ్డు కనిపిస్తుందా లేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికారులు చొరవ తీసుకొని సీసీ రోడ్ల నిర్మాణం నాణ్యత ప్రమాణాలు పాటించాలని, లేని పక్షంలో బిల్లులు నిలిపివేస్తామని హెచ్చరించి ఉంటే ఇలా జరిగేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇకనైనా ప్రజల కోరిక మేరకు సంబంధిత అధికారులతో పరిశీలించి, నిర్లక్ష్యం ఎవరిదో వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
*బిల్లులు ఇంకా పంపలేదు*
*మనోహర్, పంచాయితీరాజ్ ఏఈ*
నెల రోజుల క్రితం వేసిన సీసీ రోడ్లు ఇంకా పరిశీలించలేదు, బిల్లులు పంపలేదు, సీసీ రోడ్డులో నాణ్యత పాటించారా లేదా అని చూసి నాణ్యత ఉంటేనే బిల్లులు పంపుతాము, నాణ్యత తగ్గిందంటే బిల్లులు నిలిపి వేస్తాం,