రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

-రైతుల ఖాతాల్లో రూ.1,018 కోట్లు జమ

*ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు

పెద్దపల్లి,జూన్11:(ప్రజాకలం జిల్లాప్రతినిధి)
ఈ రబీ సీజన్ లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా,రికార్డు స్థాయిలో ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేసిందని ప్రభుత్వ విప్,పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి ఈ కొనుగోళ్లే నిదర్శనమన్నారు.ఈ రబీ సీజన్ లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 334 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 4,29,921 మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని విజయవంతంగా సేకరించామని,ఇందుకు గాను రైతులకు దాదాపు 1,018 కోట్ల 65 లక్షల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లించామని స్పష్టం చేశారు.గత ఏడాదితో పోలిస్తే ఈసారి పెద్దపల్లి జిల్లాలో సుమారు 29వేల మెట్రిక్ టన్ల ధాన్యం అదనంగా సేకరించినట్లు వివరించిన ఆయన,మార్కెట్ యార్డుల ద్వారా సుమారు 25వేల మెట్రిక్ టన్ల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేశామని తెలిపారు.అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినా,రంగు మారినా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని, రైతుల వద్ద చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు.భవిష్యత్తులో రైతులు పండించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ ఉంచేందుకు పెద్దపల్లి నియోజకవర్గంలో 1.70 లక్షల మెట్రిక్ టన్ల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు.ఇందులో భాగంగా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో గిడ్డంగుల సంస్థ ద్వారా 20వేల మెట్రిక్ టన్ల సామర్థ్యంతో గోదాము పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని,సింగిల్ విండో ఆధ్వర్యంలో మరో 14వేల మెట్రిక్ టన్ల గోదాముకు భూమి కేటాయించామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఓదెల మండలంలో 20వేల మెట్రిక్ టన్లు, శ్రీరాంపూర్‌లో 2వేల మెట్రిక్ టన్లు,పెద్దపల్లి మండలంలో 2వేల మెట్రిక్ టన్ల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యాన్ని భద్రపరుచుకోవడానికి ఈ గోదాములు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదే సమయంలో విపక్షాల తీరుపై ప్రభుత్వ విప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీఆర్ఎస్,బీజేపీలు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. పెద్దపల్లి నియోజకవర్గానికి కాళేశ్వరం ప్రాజెక్టు నీటి వల్ల పంటలు పండలేదని,గతంలో జవహర్ లాల్ నెహ్రూ,ఇందిరా గాంధీ ల కాలంలో ప్రారంభమైన ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నీటి ద్వారానే ఇక్కడి రైతులకు సాగునీరు అందిందని స్పష్టం చేస్తూ,కాళేశ్వరం ద్వారా ఏ ఊరికి నీళ్లొచ్చాయో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ,అన్నారం బ్యారేజీల నిర్మాణంలో తీవ్ర లోపాలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, అందుకే బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు.ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల ఆధారంగా శాస్త్రీయంగా మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ పనులను చేపడుతోందని వివరించారు.ప్రాజెక్టులపై అవగాహనతో మాట్లాడాలని,సలహాలు ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ ని అసెంబ్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించినా ప్రతిపక్షాలు ముందుకు రావడం లేదని విమర్శించారు.జిల్లాలో ధాన్యం,మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను ఇంత పకడ్బందీగా విజయవంతం చేసినందుకు జిల్లా కలెక్టర్ కు,ఐకేపీ మహిళా సంఘాల ప్రతినిధులకు మరియు వివిధ శాఖల అధికారులకు ప్రభుత్వ విప్ విజయరమణారావు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్,మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూర మల్లారెడ్డి,మాజీ జెడ్పిటిసి సారయ్య గౌడ్, నియోజకవర్గంలోని వివిధ గ్రామాల సర్పంచులు,ప్రజా ప్రతినిధులు,మున్సిపల్ కౌన్సిలర్లు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )