
జనంసాక్షి’ ఎడిటర్ పై కేసు.. ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛపై దాడియే ..
‘జనంసాక్షి’ ఎడిటర్ పై కేసు..
ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛపై దాడియే ..
టియుడబ్ల్యూజే (ఐజెయు) ప్రింట్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్,మహమ్మద్ అజీమ్
మెట్ పల్లి (ప్రజాకలం ప్రతినిధి)
జనం సాక్షి పత్రిక ఎడిటర్ మహ్మద్ ముజీబుల్ రెహమాన్ పై నమోదు చేసిన కేసు ముమ్మాటికి పత్రికా స్వేచ్ఛపై దాడిగా పరిగణించాల్సిందేనని ఆ కేసును వెంటనే ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (ఐజెయు)ప్రింట్ మీడియా మెట్ పల్లి అధ్యక్ష కార్యదర్శులు బూరం సంజీవ్, మహమ్మద్ అజీమ్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యదర్శులు మంగళ వారం ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. ఎవరికైనా వ్యతిరేకంగా వార్తలు
రాస్తే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయాలే కానీ అక్రమంగా కేసులు నమోదు చేయటం ఎంతవరకు సమంజసమని వారు విమర్శించారు. పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో రెహమాన్ లేనప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యం రెహమాన్ పై ఫిర్యాదు చేయడం, దానికి రాజోలి పోలీసులు కేసు నమోదు చేయడం కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి పత్రిక స్వేచ్ఛపై దాడి చేయడమేనని, ప్రజా
వ్యతిరేకతను జనంసాక్షి పత్రికలో ప్రచురించడంతో ఫ్యాక్టరీ యాజమాన్యం తట్టుకోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడిందని వారు ఆరోపించారు. జనం సాక్షి ఎడిటర్ పై పెట్టిన కేసును విరమించుకోకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని టీయూడబ్ల్యూజే (ఐజెయు) ప్రింట్ మీడియా మెట్ పల్లి అధ్యక్ష కార్యదర్శులు హెచ్చరించారు.