
ఎన్నికల సమాచారంలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం
ఎన్నికల సమాచారంలో పారదర్శకతే ప్రజాస్వామ్యానికి బలం
ఢిల్లీలో ఈసీఐ జాతీయ సదస్సు..పాల్గొన్న తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు
న్యూఢిల్లీ, జులై 3 (ప్రజా కలం ): ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలంటే సమయానుకూలంగా, వాస్తవాధారితంగా, పారదర్శకంగా సమాచారాన్ని చేరవేయడం అత్యంత కీలకమని జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన మీడియా & కమ్యూనికేషన్ నోడల్ అధికారుల జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.
15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సుమారు 240 మంది జిల్లా ప్రజాసంబంధాల అధికారులు (డీపీఆర్వోలు), మీడియా నోడల్ అధికారులు, సోషల్ మీడియా నోడల్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల కమ్యూనికేషన్, మీడియా నిర్వహణ, ఎన్నికల చట్టాలు, డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ (ఏఐ), సోషల్ మీడియా సవాళ్లు, తప్పుడు ప్రచారాన్ని అరికట్టే వ్యూహాలపై నిపుణులు అవగాహన కల్పించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పౌరసత్వ చట్టం–1955 నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నామని, అర్హులైన భారతీయ పౌరుల పేర్లు మాత్రమే ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు.
సదస్సులో ఎన్నికల పారదర్శకత, ఫారం–17సీ, రాజ్యాంగంలోని ఆర్టికల్–324 నిబంధనలు, మీడియా నియంత్రణ, పెయిడ్ న్యూస్ పర్యవేక్షణ, ఎన్నికల సమాచార వ్యూహాలు, ఏఐతో రూపొందించే కంటెంట్, డీప్ఫేక్ల వల్ల ఎదురవుతున్న సవాళ్లపై ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రూపొందించిన సమగ్ర డిజిటల్ వేదిక **ఈసీఐనెట్ (ECINet)**ను పరిచయం చేశారు. ఓటరు నమోదు, వివరాల సవరణ, పోలింగ్ కేంద్రాల సమాచారం, అభ్యర్థుల అఫిడవిట్లు, ఎన్నికల ఫలితాలు తదితర సేవలను ఒకే వేదిక ద్వారా ప్రజలకు అందించే ఈ వ్యవస్థపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ తరఫున ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ అదనపు కార్యదర్శి ఎన్. శంకర్, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ప్రసన్న రాజ్, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త సంచాలకులు యు. వెంకటేశ్వరరావు, ప్రజాసంబంధాల అధికారులు ఎం. కిరణ్మయి, ఎ. వనజతో పాటు మీనాక్షి, ఇందిర, అనిల్, విశ్వేశ్ తదితర జిల్లా ప్రజాసంబంధాల అధికారులు సదస్సులో పాల్గొన్నారు.

